- జాతిపై పిచ్చికూతలు కూస్తే ఖబడ్దార్!
- బీఆర్ఎస్ నేత రాజుగౌడ్కు కాంగ్రెస్ నాయకుడు జాదవ్ రాములు నాయక్ హెచ్చరిక
జనవాహిని ప్రతినిధి తాండూరు : తమ జాతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోకపోతే ‘ఖబడ్దార్’ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జాదవ్ రాములు నాయక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ను తీవ్రంగా హెచ్చరించారు. గురువారం తాండూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ను లక్ష్యంగా చేసుకుని, ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా రాజుగౌడ్ చేసిన వ్యాఖ్యలను రాములు నాయక్ తీవ్రంగా ఖండించారు. “పూటకో పార్టీ మార్చే చరిత్ర రాజుగౌడ్ది. కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ అంటూ తిరుగుతూ నమ్ముకున్న వారిని మోసం చేయడం ఆయనకు అలవాటు అని విమర్శించారు. గతంలో ధారాసింగ్, ఉత్తమ్ చంద్ల వల్లనే రాజుగౌడ్కు కౌన్సిలర్ టికెట్ దక్కిందనే విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు.రాజుగౌడ్ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి ‘ఐరన్ లెగ్’ లా మారారని రాములు నాయక్ ఎద్దేవా చేశారు. తాము ఒకే పార్టీలో ఉంటూ గతంలో రోహిత్ రెడ్డి గెలుపు కోసం, అలాగే ప్రస్తుత తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విజయం కోసం చిత్తశుద్ధితో పనిచేశామని వివరించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమేనని, కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం, జాతిని ఉద్దేశించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు.ధారాసింగ్పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాజుగౌడ్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రాములు నాయక్ స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి పిచ్చికూతలు కూస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.



