
- రేపటి నుండి ఐదు రోజుల పాటు తాగునీటి సరఫరా బంద్
- మిషన్ భగీరథ పైప్లైన్ వాల్వ్ మరమ్మతులు
- సహకరించాలని కోరిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్
జనవాహిని ప్రతినిధి వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. ఎల్లూరు నుండి గౌరిదేవిపల్లి వరకు ఉన్న మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ వద్ద అత్యవసర వాల్వ్ నిర్వహణ పనులు చేపట్టడం వల్ల, ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా లోని వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు మరియు అనుబంధ గ్రామాలకు ముడి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. ఐదు రోజుల పాటు పనులు కొనసాగనున్నందున, ఈ ప్రాంతాల్లోని ప్రజలు తమ అవసరాలకు సరిపడా నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రధాన పైప్లైన్ నిర్వహణ దృష్ట్యా ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని గమనించి, విభాగం అధికారులకు సహకరించాలని ఈఈ సురేష్ విజ్ఞప్తి చేశారు. పనులు పూర్తి కాగానే యథావిధిగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు.



