- తాండూర్ ‘బల్దియా’పై కాంగ్రెస్ జెండా..!
- ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసిన ‘బుయ్యని’ సోదరులు
- డబ్బు రాజకీయంపై ప్రజా తీర్పు గెలుపు.. తాండూర్ వ్యాప్తంగా సంబరాలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ మున్సిపల్ ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. గత కొద్ది రోజులుగా ఉత్కంఠ రేపిన బల్దియా పీఠాన్ని హస్తం పార్టీ కైవసం చేసుకుంది. ఈ విజయం తాండూర్ రాజకీయాల్లో ఒక నూతన శకానికి నాంది పలికినట్లయింది. ముఖ్యంగా బుయ్యని సోదరుల నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు సాగించిన పోరాటం ప్రత్యర్థులను కంగుతినిపించింది.ఎన్నికల బరిలో ప్రత్యర్థులు సాగించిన దుష్ప్రచారాలు, కుట్రలు, మరియు విచ్చలవిడి ధన ప్రవాహాన్ని ఓటర్లు తిప్పికొట్టారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అభివృద్ధి – నిజాయితీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన బుయ్యని సోదరులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రత్యర్థులు పన్నిన రహస్య ఒప్పందాలను, రాజకీయ వ్యూహాలను తమ ‘డబుల్ స్ట్రాటజీ’తో బుయ్యని సోదరులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బుయ్యని మనోహర్ రెడ్డి, వారి సోదరుల ప్రభావం ఈ ఎన్నికలతో మరోసారి నిరూపితమైంది. కేవలం అధికారం కోసమే కాకుండా, తాండూర్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వారు చేసిన కృషికి ఓటర్లు ‘ఓటు రూపంలో నీరాజనాలు పలికారన్నారు. ఇకపై రాజకీయాల్లో బుయ్యని సోదరుల పేరు ఒక బలమైన ‘బ్రాండ్’గా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయం అనంతరం బుయ్యని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఈ గెలుపు తాండూర్ ప్రజలదని కొనియాడారు. ఓటు వేసి గెలిపించిన ఓటర్లకు, ప్రాణాలకు తెగించి పోరాడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపారు. తాండూర్ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలుపుతామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.






