- ఫెయిల్ అయ్యానని భయపడిన విద్యార్థి
- తండ్రి మందలిస్తాడనే భయంతో విద్యార్థి అదృశ్యం
- అంతరం గ్రామంలో కలకలం
- ఆందోళనలో తల్లిదండ్రులు, గాలిస్తున్న పోలీసులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించాల్సిన పరీక్షా ఫలితాలు ఒక నిండు ప్రాణాన్ని భయంలోకి నెట్టాయి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యానన్న బాధకంటే, తండ్రి కొడతాడన్న భయం ఆ విద్యార్థిని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసింది. ఈ ఘటన తాండూరు మండలం అంతరం గ్రామంలో స్థానికంగా కలకలం రేపుతోంది.గ్రామానికి చెందిన నక్కల పుల్లప్ప కుమారుడు సైమన్, తాండూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో సిఈసి ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సైమన్ కేవలం ఒక్క సబ్జెక్టులో మాత్రమే పాసై, మిగిలిన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అప్పటికే చుట్టుపక్కల వారు, స్నేహితులు మార్కుల గురించి అడుగుతుండటం.. ఇంట్లో తండ్రికి తెలిస్తే దండిస్తాడనే ఆందోళనతో సైమన్ ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు.మధ్యాహ్నం బయటకు వెళ్లిన కుమారుడు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధుమిత్రుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ దొరకలేదు. దీంతో విద్యార్థి తండ్రి పోలీసులను ఆశ్రయించి తన కుమారుడిని వెతికి పెట్టాలని వేడుకున్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



