- బిఆర్ఎస్ నేత రాజుగౌడ్పై చర్యలకు బంజారా సమాజ్ డిమాండ్
- రాజకీయ విమర్శల పేరుతో కులాలను కించపరచడం తగదు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన తాండూరు బంజారా నేతలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాజకీయ స్వార్థం కోసం ఒక జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని తాండూరు బంజారా సమాజ్ నేతలు హెచ్చరించారు. గురువారం తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు బిఆర్ఎస్ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బుధవారం నిర్వహించిన ఒక ప్రెస్ మీట్లో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ను విమర్శించే క్రమంలో, రాజుగౌడ్ బంజారా జాతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమేనని, కానీ ఆ విమర్శలు వ్యక్తిగత స్థాయి దాటి ఒక వర్గాన్ని లేదా జాతిని లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని వారు మండిపడ్డారు.ధారాసింగ్పై వ్యక్తిగత విమర్శలు చేసుకోవచ్చు, కానీ బంజారా జాతిని ఇందులోకి లాగడం అన్యాయమన్నారు. రాజుగౌడ్ చేసిన వాఖ్యలు మా మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి అని నేతలు పేర్కొన్నారు. తక్షణమే రాజుగౌడ్ను బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బంజారా సమాజ్ ముఖ్య నేతలు అనిల్ కుమార్ రాథోడ్, గోపాల్, చందర్ చౌహాన్, పవన్ కుమార్, రమేష్, శ్రీను జాదవ్, బాబు నాయక్ తదితరులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.



