- నేపాల్ షూటింగ్ బాల్ టోర్నమెంట్లో తాండూరు యువకుడి ‘బంగారు’ విజయం
- ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
జనవాహిని ప్రతినిధి తాండూరు : నేపాల్లోని ఖాట్మండు వేదికగా జరిగిన అంతర్జాతీయ షూటింగ్ బాల్ టోర్నమెంట్లో తాండూరు పట్టణానికి చెందిన యువకుడు మొయిజ్ అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన ట్రక్ డ్రైవర్ మహమ్మద్ రఫీక్ కుమారుడైన మొయిజ్, ఈ టోర్నమెంట్లో తన అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ విజయంతో మొయిజ్కు గోల్డ్ మెడల్తో పాటు ప్రతిష్టాత్మక విజేత ట్రోఫీని నిర్వాహకులు అందజేశారు.తాండూరు యువకుడు అంతర్జాతీయ స్థాయిలో రాణించి పట్టణ కీర్తిని దశదిశలా చాటడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఘనత సాధించిన మొయిజ్ను ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు సంయుక్తంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కష్టపడితే క్రీడల్లో అద్భుతాలు సాధించవచ్చని, మొయిజ్ విజయం తాండూరు యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ సన్మాన కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అథర్, సెక్రటరీ ఎండి యూనస్ ప్రధానంగా పాల్గొన్నారు. వారితో పాటు ఉపాధ్యక్షులు అబ్దుల్ ఖవీ, అబ్దుల్ హమీద్, అసద్, లతీఫ్, సాజిద్ తదితరులు మొయిజ్ను శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మొయిజ్ మరిన్ని అంతర్జాతీయ పథకాలు సాధించాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.



