- విలియం మూన్ గ్రౌండ్లో చెలరేగిన మంటలు
- పచ్చని చెట్లు దగ్ధం అగ్నికి ఆహుతైన ‘స్వచ్ఛమైన గాలి’..
- అగ్నిప్రమాదమా లేక ఆకతాయిల పనా?
జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణ ప్రజల ఆక్సిజన్ హబ్, క్రీడాకారులు మరియు వాకర్ల నిలయమైన విలియం మూన్ గ్రౌండ్లో సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వేసవి తీవ్రత దృష్ట్యా పట్టణ ప్రజలకు చల్లని గాలిని, నీడను ఇచ్చే చెట్లు అగ్నికీలలకు చిక్కుకోవడంతో పచ్చని ప్రకృతి కాస్తా మసిబారిపోయింది.వివరాల్లోకి వెళ్తే..తాండూరు పట్టణంలోని విలియం మూన్ గ్రౌండ్లో పదుల సంఖ్యలో ఏపుగా పెరిగిన చెట్లు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా చెట్లకు మంటలు అంటుకొని వేగంగా వ్యాపించాయి. మండుతున్న ఎండలకు తోడు గాలి తోడవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పట్టణానికి ఎంతో స్వచ్ఛమైన గాలిని అందించే వృక్షాలు కాలిపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎండ తీవ్రత వల్ల ఎండుటాకులు రాపిడికి గురై జరిగిందా? లేక ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వందలాది మంది ఇక్కడ జాగింగ్, వ్యాయామం చేస్తుంటారు. స్వచ్ఛమైన గాలి, చల్లని వాతావరణం అందిస్తున్న ఈ చెట్లు కాలిపోవడం తో వాకర్ లకు నిరాశ ను తెచ్చింది. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని ప్రచారం చేస్తున్న తరుణంలో, ఉన్న చెట్లను కాపాడుకోలేకపోవడం దురదృష్టకరమని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. క్రీడాకారుల అడుగులతో కళకళలాడే ఈ గ్రౌండ్, పట్టణానికి ఒక లంగ్ (ఊపిరితిత్తులు) లాంటిది. అలాంటి చోట చెట్లు కాలిపోవడంపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది



