- చావుకు కూడా ‘గలీజ్’ ముహూర్తం!
- పగలైతే ‘బార్’.. రాత్రయితే ‘లాడ్జి’.. ఇక్కడ అన్నీ ఫ్రీ!
- ఏళ్ల తరబడి ‘వ్యూహకర్త’ల పర్యటనలు.. ఎమ్మెల్యేల ఫోజులు!
- కనీసం గేటు కూడా లేని దుస్థితి.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు
తాండూరు జనవాహిని ప్రతినిధి : చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? అని మృతులు ఆత్మలు గోల పెడుతున్నాయో లేదో తెలీదు కానీ, తాండూరులోని బీసీ స్మశాన వాటిక దుస్థితి చూస్తుంటే బతికున్న వారికి మాత్రం ఒళ్ళు మండుతోంది. ఇందిరా చౌక్ నడిబొడ్డున, సాక్షాత్తూ పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో వెలసిన ఈ స్మశాన వాటిక ఇప్పుడు పట్టణంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ బార్ అండ్ రెస్టారెంట్ గా పేరుగాంచింది.పగలు పూట మద్యం సీసాలు ఖాళీ చేసే వారు.. రాత్రి పూట వ్యభిచార కార్యకలాపాలతో రచ్చ చేసే వారు.. మూత్ర విసర్జనతో పరిసరాలను కంపు కొట్టించే వారు.. ఇలా ఒకటేమిటి, గలీజ్ పనులన్నింటికీ ఈ స్మశానమే కేరాఫ్ అడ్రస్. కనీసం గేటు కూడా లేని ఈ ప్రాంతం అసాంఘిక శక్తులకు “ప్రైవేట్ రిసార్ట్” లా మారిపోయింది. గతంలో జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు, బీసీ నాయకులు ఎంతో మంది ఈ స్మశాన వాటికను సందర్శించారు. అక్కడ నిలబడి ఫోటోలు దిగి, “త్వరలోనే స్మశాన వాటిక రూపురేఖలు మార్చేస్తాం.. గేట్లు పెడతాం.. గార్డెన్లు వేస్తాం” అంటూ భారీ ప్రణాళికలు (ప్లాన్లే తప్ప పని లేదు) వేసి వెళ్లిపోయారు. బీసీ నాయకులు అప్పుడప్పుడ ఎంతో ఇంతో శుభ్రం చేసి వెళ్లిన, శాశ్వత పరిష్కారం మాత్రం మృతుల ఆత్మలకే వదిలేసినట్టు కనిపిస్తోంది. తాండూరు పట్టణం లో ఉన్న ఏకైక బీసీ స్మశాన వాటిక దుస్థితి ఇలా ఉంటే…. ఎలా అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



