- తాండూరులో ఘనంగా ఇఫ్తార్ విందు
- ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్న పైలెట్ రోహిత్ రెడ్డి కుటుంబం
- భారీగా తరలివచ్చిన మత పెద్దలు, బీఆర్ఎస్ శ్రేణులు
- సామాజిక ఐక్యతకు ఇఫ్తార్:పంజుగుల విఠల్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణంలోని ముస్లిం సోదరులు, మత పెద్దలు మరియు రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఆదివారం సాయంత్రం మత పెద్దల ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు తమ ఉపవాసాన్ని విరమించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు, పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి పంజుగుల విఠల్ రెడ్డి స్వయంగా ముస్లిం మత పెద్దలకు ఖర్జూరం తినిపించి ఇఫ్తార్ విందును ప్రారంభించారు. అనంతరం అందరితో కలిసి విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. రంజాన్ పవిత్రతను, క్రమశిక్షణను చాటిచెప్పే మాసమని కొనియాడారు. రోజంతా కఠిన ఉపవాసం ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులతో కలిసి నిర్వహించుకునే ఇఫ్తార్ విందు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, వెంకట్ రెడ్డి, బషారత్, సర్పంచ్ పాండురంగా రెడ్డి, మధుసూదన్ రెడ్డిలతో పాటు పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



