― Advertisement ―

కాగ్నా చెంతన.. కన్.. (నీటి) తిప్పలు…!

కాగ్నా చెంతన.. గొంతుకల ఎండుట..! ఎల్మకన్నలో వారం రోజులుగా తాగునీటి సరఫరా బంద్ వ్యవసాయ బోరు బావులే దిక్కు.. మహిళల ఆవేదన నీరు లేక విలవిలలాడుతున్న మూగజీవాలు ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంపై...
HomeNEWSఉచిత వైద్యం ఉత్తుత్తిదే...!

ఉచిత వైద్యం ఉత్తుత్తిదే…!

spot_img
  • తాండూరు డయాలసిస్ కేంద్రంలో రోగులకు తప్పని తిప్పలు!
  • ​ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజక్షన్ల కొరత.. బయట కొనుగోలు చేయాల్సిందేనని సిబ్బంది ఉచిత సలహా
  • నిరుపేద రోగులపై నెలకు వేలాది రూపాయల అదనపు భారం.
  • పట్టించుకోని అధికారులు.. ‘జనవాహిని’ ప్రత్యేక కథనం.

జనవాహిని ప్రతినిధి తాండూరు : పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవడానికి వస్తున్న నిరుపేద రోగులకు ఇక్కడ చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఉచితంగా అందాల్సిన అత్యవసర ఇంజక్షన్లు లేకపోవడంతో, బాధితులు విధిలేక బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో వేలాది రూపాయలు పోసి కొనుగోలు చేయాల్సి వస్తోంది.

కంటితుడుపుగా డయాలసిస్.. ఖరీదైన మందులన్నీ బయటకే…

తాండూరు మరియు పరిసర మండలాల నుండి వందలాది మంది కిడ్నీ బాధితులు ఈ డయాలసిస్ కేంద్రంపై ఆధారపడి ఉన్నారు. అయితే, డయాలసిస్ ప్రక్రియ కేవలం మిషన్ల ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడానికే పరిమితమవుతోంది. డయాలసిస్ పేషెంట్లకు అత్యంత కీలకమైన ఎరిత్రోపాయిటిన్ (EPO)మరియు ఐరన్ సుక్రోజ్ వంటి ఇంజక్షన్లను ఇక్కడ ఇవ్వడం లేదు. కిడ్నీలు దెబ్బతినడం వల్ల రక్తహీనత (ఎనిమియా) బారిన పడకుండా ఉండటానికి ఈ ఇంజక్షన్లు తప్పనిసరి. కానీ, గత కొంతకాలంగా ఈ కేంద్రంలో ఈ మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేంద్రంలో అడిగితే స్టాక్ లేదు.. బయట నుండి కొనుక్కురండి అంటూ సిబ్బంది ప్రిస్క్రిప్షన్ చేతిలో పెడుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిరుపేదలపై ఆర్థిక భారం:

ఒక్కో ఈపీఓ (EPO) ఇంజక్షన్ ధర బయట మార్కెట్లో రూ. 1,500 నుండి రూ. 2,500 వరకు పలుకుతోంది. వారానికి ఒకటి లేదా రెండు ఇంజక్షన్లు చొప్పున, ఒక రోగి కేవలం ఇంజక్షన్ల కోసమే నెలకు రూ. 6,000 నుండి రూ. 10,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. డయాలసిస్ చేయించుకునే వారంతా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలే కావడంతో, ఈ అదనపు భారం భరించలేక అప్పులపాలవుతున్నారు. కొన్నిసార్లు డబ్బులు లేక ఇంజక్షన్లు వేయించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. దీనివల్ల వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.

స్పందించని అధికారులు.. తక్షణ చర్యలు అవసరం:

ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు (DM&HO) ఈ సమస్యపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాండూరు డయాలసిస్ కేంద్రానికి అవసరమైన ఇంజక్షన్ల స్టాక్‌ను తక్షణమే సరఫరా చేయాలని, నిరుపేద రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ప్రజలు, బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

బాధితుల గొంతుక (రోగి/బంధువు మాట):

….మాకు ఉచితంగా వైద్యం అందుతుందని ఇక్కడికి వస్తున్నాం. కానీ ప్రతినెలా ఇంజక్షన్ల కోసమే వేలాది రూపాయలు ఖర్చవుతున్నాయి. కూలీ పనులు చేసుకునే మేము అంత డబ్బు ఎక్కడి నుండి తేవాలి? ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి……..

ఒక బాధిత కుటుంబ సభ్యుడు, తాండూరు.