- తాండూరులో అత్యాధునిక ‘హియరింగ్ అండ్ స్పీచ్ థెరపీ’ కేంద్రం ప్రారంభం
- ఇందిరా చౌక్ సమీపంలో సేవలు అందుబాటులోకి..
- వెల్లడించిన ఆడియాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్
జనవాహిని ప్రతినిధి తాండూర్: తాండూరు పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో పట్టణంలోని ఇందిరా చౌక్ సమీపంలో ‘హియరింగ్ అండ్ స్పీచ్ థెరపీ’ (వినికిడి మరియు మాటల చికిత్స) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ ఆడియాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, చికిత్సా సేవలను ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, వినికిడి లోపం, మాటలు సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కేంద్రంలో అత్యాధునిక డిజిటల్ పరికరాల ద్వారా వినికిడి పరీక్షలు నిర్వహించడంతో పాటు, మాటల లోపాలు ఉన్న వారికి ప్రత్యేక ‘స్పీచ్ థెరపీ’ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇక్కడ చికిత్స లభిస్తుందని ఆయన వివరించారు. ముఖ్యంగా పుట్టుకతో మాటలు రాని పిల్లలకు, మధ్యలో మాటలు పడిపోయిన వారికి సరైన సమయంలో కౌన్సెలింగ్ మరియు థెరపీ అందిస్తే వారు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ ధీమా వ్యక్తం చేశారు.వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలను పొందవచ్చని ఆయన సూచించారు. తాండూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ చంద్రశేఖర్ కోరారు. మరింత సమాచారం మరియు సంప్రదింపుల కోసం ఇందిరా చౌక్ సమీపంలోని క్లినిక్ నందు సంప్రదించవచని సూచించారు.



