- రూ. 2000 కోట్లతో పుణ్యక్షేత్రాల పునరుద్ధరణ
- శృంగేరి జగద్గురువుల మార్గదర్శకత్వంలో పనులు
- భవిష్యత్తులో తెలంగాణ ‘టెంపుల్ హబ్’
- రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ శర్మ
జనవాహిని ప్రతినిధి తెలంగాణ : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ శర్మ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటన లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వెల్లడించారు.శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామివారి ఆదేశానుసారం రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల పునర్నిర్మాణానికి చర్యలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. “వేములవాడ, భద్రాచలం, బాసర వంటి చారిత్రాత్మక క్షేత్రాలను దాదాపు ₹1500 కోట్ల నుంచి ₹2000 కోట్ల వ్యయంతో అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. భక్తులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు నిత్య పూజలు, కళ్యాణాలు, హోమాలు శాస్త్రోక్తంగా జరిగేలా ప్రణాళికలు రూపొందించాం” అని వివరించారు.కేవలం రాజకీయ లబ్ధి కోసం దేవాలయాలను ఉపయోగించుకునే వారికి ప్రభుత్వం చేస్తున్న పనులే సమాధానమని శర్మ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణలో సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని, బ్రాహ్మణ పోషణతో పాటు దేవాలయాల సంరక్షణే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. గతంలో యాదాద్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూనే, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న భద్రాద్రి, వేములవాడ, బాసర క్షేత్రాల అభివృద్ధిని తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రం కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఐటీ, మెడికల్, ఇండస్ట్రియల్ హబ్గా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని చూరగొంటుందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.



