- బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కౌన్సిలర్ హెచ్చరిక
- కమిషన్ల కోసం పాకులాడే మీరా మాపై విమర్శలు చేసేది?
- పదేళ్లలో ఇవ్వని ఇళ్లు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో ఇప్పుడు నెరవేరుతున్నాయి.
- బిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలను ఖండించిన వార్డు 26 కౌన్సిలర్ ఎన్ వైశాలి రాజు గౌడ్
జనవాహిణి ప్రతినిధి తాండూరు : గత పదేళ్ల పాలనలో ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, కేవలం జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకులు.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై బురదజల్లడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ 26వ వార్డ్ కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ధ్వజమెత్తారు. గత రెండు మూడు రోజులుగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు.బీఆర్ఎస్ నాయకుల తీరు ‘కుక్క తోక వంకర’ అన్నట్లుగా ఉందని వారు ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో దళిత బంధు ఇప్పిస్తే రూ. 4 లక్షలు, బీసీ బంధులో రూ. లక్ష చొప్పున కమిషన్లు వసూలు చేసిన ఘనత మీది కాదా? అని ప్రశ్నించారు. సొంత వార్డుల్లో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, కేవలం తమ రాజకీయ అస్తిత్వం కోసం లేనివి ఉన్నట్లుగా మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నియోజకవర్గ రూపురేఖలు మారుతున్నాయని వారు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు. తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో, వార్డుకు 12 మంది చొప్పున అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఎమ్మెల్యే పనిచేస్తున్నారున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తూ, పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. గత పదేళ్లలో ఉద్యోగులను బానిసలుగా వాడుకొని, లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో అధికారులు, ఉద్యోగులు, కార్యకర్తలు తమ బాధ్యతలను సజావుగా నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేశారు.ఇప్పటికైనా విమర్శలు మానుకొని, వార్డుల్లోని సమస్యలను మున్సిపల్ చైర్పర్సన్ లేదా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. అలా కాకుండా వ్యక్తిగత దూషణలకు దిగితే సహించే ప్రసక్తే లేదని, అబద్ధపు ప్రచారాలు చేస్తే ‘ఖబడ్దార్’ అని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం కోరుతూ అడుగులు వేయాలని, తస్మాత్ జాగ్రత్త అంటూ బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.



