- మొయినాబాద్లో ‘పైలట్’ ఫామ్హౌస్పై ఈగల్ టీమ్ మెరుపుదాడి!
- డ్రగ్స్ పార్టీలో కాల్పుల కలకలం..
- మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా 8 మంది అరెస్ట్
జనవాహిని ప్రతినిధి తాండూరు : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలో అర్ధరాత్రి వేళ భారీ కలకలం రేగింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో డ్రగ్స్ సేవించిన వారు పోలీసులను అడ్డుకోవడమే కాకుండా, రివాల్వర్తో కాల్పులు జరపడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.విశ్వసనీయ సమాచారం మేరకు ‘ఈగల్ టీమ్’ అధికారులు ఫామ్హౌస్లోకి ప్రవేశించగా, అక్కడ డ్రగ్స్ మత్తులో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా హంగామా సృష్టించారు. పోలీసుల రాకను గమనించి వారిని అడ్డుకునే క్రమంలో నిందితులు రివాల్వర్తో ఫైర్ ఓపెన్ చేశారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగి ఫామ్హౌస్ను చుట్టుముట్టారు.సోదాల్లో భాగంగా పోలీసులు రెండు గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్, బుల్లెట్లను ఈగల్ టీమ్ సీజ్ చేసింది. పార్టీ జరుగుతున్న ప్రదేశంలో డ్రగ్స్తో పాటు ఇతర నిషేధిత పదార్థాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఏడుగురు ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పలువురు రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. నిందితులందరినీ వెంటనే రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు.ఒక మాజీ ప్రజాప్రతినిధి ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ జరగడం, అందులోనూ పోలీసులపైనే కాల్పులు జరపడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని, చట్టం ముందు ఎవరూ అతిథులు కాదని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.



