- కౌన్సిలర్లను పక్కన పెట్టి పార్టీ నేతలకే ప్రాధాన్యత
- ప్రోటోకాల్ ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత ఎక్కడ?
- జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కౌన్సిలర్లు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీలో ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలు మిన్నంటాయని, ఎన్నికైన ప్రజాప్రతినిధులను విస్మరిస్తూ పాలన సాగిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. పట్టణంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు యధేచ్ఛగా జరుగుతున్నాయని ఆరోపిస్తూ, శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.మున్సిపాలిటీలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ఎన్నికైన కౌన్సిలర్లకు కనీస సమాచారం ఇవ్వడం లేదని బిఆర్ఎస్ కౌన్సిలర్ లు మండిపడ్డారు. ప్రభుత్వం అందించే ‘రంజాన్ తోఫా’ పంపిణీలో కౌన్సిలర్లను భాగస్వామ్యం చేయకుండా, కేవలం అధికార పార్టీకి చెందిన నాయకుల ద్వారానే పంపిణీ చేయించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.తాండూరు పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని కౌన్సిలర్లు ఆరోపించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన అధికార పార్టీ కార్యకర్తలతో వెరిఫికేషన్ చేయిస్తూ, అర్హులను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు. మున్సిపాలిటీలో జరిగే ప్రతి అధికారిక కార్యక్రమంలో ఎన్నికైన కౌన్సిలర్లకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వాలని, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఫిర్యాదు అందజేసిన వారిలో 12 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు.



