- 2028 నాటికి పట్టణ రూపురేఖలు మారుస్తాం
- త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం
- అసెంబ్లీ హామీల అమలుకే మా ప్రాధాన్యత
- మున్సిపల్ ఎన్నికల్లో 30 సీట్లు గెలవడమే లక్ష్యం
- నర్సింగ్ కాలేజీపై విమర్శలు అర్ధరహితం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : 2028 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రగతి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ ప్రగతి, రాబోయే మున్సిపల్ ఎన్నికలు మరియు ప్రతిపక్షాల ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు.పట్టణ ప్రజల చిరకాల కోరికైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నామని, త్వరలోనే దీనికి సంబంధించిన పనులు పట్టాలెక్కుతాయని ఎమ్మెల్యే తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే తన లక్ష్యమని, ఆ దిశగా నిధుల సమీకరణ జరుగుతోందని పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో పట్టణంలోని 30 వార్డులను కచ్చితంగా కైవసం చేసుకుంటాం. గెలుపే లక్ష్యంగా మా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎవరనేది ఇప్పుడు ప్రకటించబోమని, ఎన్నికలు ముగిసిన తర్వాతే పార్టీ నిర్ణయం మేరకు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.నర్సింగ్ కాలేజీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మనోహర్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కాలేజీ స్థాపన వల్ల ఈ ప్రాంత విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను గమనించకుండా, కేవలం అవగాహన రాహిత్యంతో రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టణ అభివృద్ధికి అడ్డుపడకుండా నిర్మాణాత్మక సూచనలు చేయాలని హితవు పలికారు.






