- కేటుగాళ్ల ఆట కట్టించిన యాలాల పోలీసులు!
- 4 గంటల్లోనే గొలుసు దొంగల అరెస్ట్
- సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల వేట
- పోలీస్ బృందానికి ఎస్పీ స్నేహ మెహ్ర ప్రశంసలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : నేరగాళ్లు ఎంత వేగంగా తప్పించుకోవాలని చూసినా, చట్టం ముందు మోకరిల్లక తప్పదని యాలాల పోలీసులు నిరూపించారు. కోకట్ గ్రామంలో చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్ ఉదంతాన్ని ఛేదించడంలో పోలీసులు చూపిన చొరవ సర్వత్రా చర్చనీయాంశమైంది. కేవలం 4 గంటల సమయంలోనే నలుగురు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.మంగళవారం ఉదయం యాలాల మండలంలోని కోకట్ గ్రామంలో ఓ మహిళ లక్ష్యంగా దుండగులు రెచ్చిపోయారు. ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని క్షణాల్లో మాయమయ్యారు. ఆపై తాండూరులో ఓ మహిళా కండక్టర్పై కూడా దాడికి యత్నించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర (IPS) అప్రమత్తమై ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. యాలాల ఎస్సై విట్టల్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. నిందితులు వెళ్లిన మార్గాల్లోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టి, వారి ఆచూకీని కనిపెట్టారు. పక్కా ప్లాన్తో దాడి చేసి, నలుగురు నిందితులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.సమర్థవంతంగా పనిచేసిన ఎస్సై మరియు సిబ్బందిని ఎస్పీ స్నేహ మెహ్ర అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నేరగాళ్లకు జిల్లాలో చోటు లేదు. మహిళల భద్రత మా మొదటి ప్రాధాన్యత. నేరాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. పోలీసుల మెరుపు వేగాన్ని చూసి బాధితులు మరియు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



