HomeNewsతాండూరు రాజకీయం రగడ..!

తాండూరు రాజకీయం రగడ..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • బెదిరింపుల గద్దె’!
  • పంచాయితీ సమరంలో ఆధిపత్య పోరు…
  • ప్రజాస్వామ్యంపై దాడులు!

జనవాహిని ప్రతినిధి తాండూరు : స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే ప్రజల భాగస్వామ్యం, ప్రశాంత వాతావరణం గుర్తుకొస్తుంది. కానీ, తాండూరు నియోజకవర్గంలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా, బెదిరింపులు, దాడులు, ప్రలోభాలతో కూడిన రాజకీయంగా మారిపోయింది. అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న తీరు ఇక్కడ తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఈ ప్రాంత రాజకీయ వేడి హద్దులు దాటి, ప్రజాస్వామ్య విలువలను ప్రమాదంలో పడేస్తోంది.ప్రస్తుతం తాండూరులో పార్టీల మధ్య వైరం కేవలం సిద్ధాంతాలకే పరిమితం కావడం లేదు. ఇది వ్యక్తిగత కక్షలు, ద్వేషాలుగా రూపాంతరం చెందింది. ఒక పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మరొక పార్టీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించడం, మాటల ద్వారా భయభ్రాంతులకు గురిచేయడం పరిపాటిగా మారింది. ఈ అపరిమిత వైరం కారణంగా గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది.

అభ్యర్థుల వేట… డబ్బే పాచిక

ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహంగా ముందుకు వస్తున్న అభ్యర్థులు నేరుగా ప్రలోభాలు, బెదిరింపులకు గురవుతున్నారు. గ్రామస్థాయిలో అభ్యర్థులను డబ్బుతో లోబరుచుకునే యత్నం ముమ్మరంగా సాగుతోంది. ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని, భారీ మొత్తంలో నగదు ఆఫర్ చేయడం ద్వారా వారిని పోటీ నుంచి ఉపసంహరించుకునేలా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు, డబ్బు పాత్రికగా మారుతున్న ఎన్నికల ప్రమాదకర ధోరణిని స్పష్టం చేస్తున్నాయి.

దాదాగిరి’తో ఏకగ్రీవం చేసే కుట్ర..!

ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశం ‘పోటీ’. కానీ, తాండూరులోని కొన్ని ప్రాంతాల్లో పోటీ లేకుండా ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం తీవ్రస్థాయిలో జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. స్థానిక నాయకులు తమ పలుకుబడిని, దాదాగిరిని ఉపయోగించి ఇతర అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా లేదా వేసినా వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. అధికారాన్ని దక్కించుకోవడానికి ఏకగ్రీవం పేరిట చేస్తున్న ఈ ప్రయత్నాలు, ప్రజల ఓటు హక్కుకు విలువ లేకుండా చేస్తున్నాయనే విమర్శలు తాండూరు ప్రాంతం లో జోరుగా వినిపిస్తున్నాయి.

తెరవెనుక మంతనాలు ప్రజాస్వామ్య స్పూర్తికి భంగం

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా అత్యంత అప్రజాస్వామికంగా సాగుతోంది. నాయకులు కేవలం తమ అంతర్గత మంతనాలతోనే అభ్యర్థులను నిర్ణయించడం, ఆ నిర్ణయాలను గ్రామస్థాయిపై రుద్దడం చేస్తున్నారు. ఈ తెరవెనుక మంతనాలు, నిజమైన నాయకత్వ లక్షణాలు కలిగినవారికి అవకాశాలు దక్కకుండా చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి.మొత్తం మీద, తాండూరులో పంచాయితీ ఎన్నికలు కాస్తా ప్రాంతీయ ఆధిపత్య పోరుగా మారాయి. ఎన్నికల కమిషన్, పోలీసులు ఈ అసాధారణ పరిస్థితులపై దృష్టి సారించి, అభ్యర్థులు, ఓటర్లు స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments