హైదరాబాద్ కు ఎన్ఐడీ మంజూరు చెయ్యండి- సీఎం
యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్కు నేషనల్ డిజైన్ సెంటర్ (ఎన్ఐడీ) మంజూరు చేసిందని, నాటి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ శంకుస్థాపన చేశారని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి గోయల్కు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ఐడీని విజయవాడకు తరలించారని, ఈ నేపథ్యంలో తెలంగాణకు ఎన్ఐడీ మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెదర్ పార్క్ మంజూరు చేసిందని కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి అన్నారు. కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయని, కేంద్ర ప్రభుత్వం మెగా లెదర్ పార్క్ మంజూరు చేస్తే వెంటనే భూమి కేటాయిస్తామని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఇది మంచి ప్రతిపాదన అని, ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి సమావేశంలో పాల్గొన్న కేంద్ర అధికారులకు సూచించారు.