- తాండూరులో సీతారాముల కళ్యాణోత్సవం
- ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆర్.బి.ఓ.ఎల్ అధినేత శ్రీనివాస్ రెడ్డి
- 15వ వార్డు రామాలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని 15వ వార్డులో గల శ్రీ రాముని ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్థానిక కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప నేతృత్వంలో నిర్వహించిన ఈ కళ్యాణ వేడుకలు కన్నుల పండువగా సాగాయి.ఈ కార్యక్రమానికి తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి, ఆర్.బి.ఓ.ఎల్ అధినేత శ్రీనివాస్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ కమిటీ వారు అతిథులను ఘనంగా సన్మానించారు.ఈ వేడుకల్లో మాజీ కౌన్సిలర్ శోభారాణి పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. వార్డు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది.





