posted on Sep 12, 2024 9:44AM
సత్యవేడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదిమూలం ఆదిమూలం తనను లైంగికంగా వేధించారు, అత్యాచారం చేశారని ఆరోపించి, ఆయన మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ ఎట్టకేలకు వైద్య పరీక్షలకు ముందుకొచ్చారు. తొలుత మీడియా ముందుకు వచ్చిన ఆమె తనకు రాజకీయంగా ఎలాంటి మద్దతూలేదని, తనకు భయమేస్తోందని చెప్పిన ఆ మహిళ ఈ తరువాత వైద్య పరీక్షలకు నిరాకరించారు. దీంతో ఆమెకు బెదరింపులు వచ్చాయా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ఆదిమూలం మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ మీద సత్యవేడు ప్రాంతంలోని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న ఆదిమూలం లాంటి దళిత నాయకుడిని బదనాం చేయడానికే ఆ మహిళ ఇలాంటి ఆరోపణలు చేస్తూ, కేసు పెట్టిందని మండిపడుతూ, ఆ మహిళ మీద తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో వారు కేసులు నమోదు చేశారు.
ఇక తాజాగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన ఆదిమూలం డిశ్చార్జ్ అయ్యి పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే బంధువులు, గన్ మెన్లు ఆయనను కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. ఆదిమూలం అత్యాచారం కేసుకు సంబంధించి తిరుపతి ఇంటెలిజెన్స్ డిఎస్పి కనజక్షన్ నేతృత్వంలో విచారించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మరోవైపు తపపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం (సెప్టెంబర్ 9)క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి దర్యాప్తూ చేయకుండానే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆదిమూలం పిటిషన్ లో పేర్కొన్నారు.
అదలా ఉండగా ఇంత కాలం వైద్యపరీక్షలకు నిరాకరించిన బాధితురాలు ఆదిమూలం క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం వైద్య పరీక్షలకు ముందుకొచ్చారు. తిరుపతి మెటర్నరీ హాస్పిటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మరో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు. ఇక ఆ వైద్య పరీక్షల రిపోర్టు ఆధారంగా పోలీసులు ఎమ్మెల్యేను విచారించనున్నారు. ఇలా ఉండగా ఎమ్మెల్యే ఆదిమూలం తరఫుర న్యాయవాది శేషకుమారి వాదించనుండగా, ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా వరలక్ష్మి వాదించనున్నారు.