posted on Sep 10, 2024 4:43PM
సరే జగన్ అరాచకపాలనకు జనం తమ ఓటుతో చరమగీతం పాడారు. తెలుగుదేశం కూటమి సర్కార్ ఇప్పుడు అధికారంలో ఉంది. వైసీపీ గతంలో పాల్పడిన అక్రమాలు, అన్యాయాలు, దాడులు, హింసాకాండలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలూ దేవాలయంగా భావించే పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులో ప్రధాన నిందితులు ఎమ్మెల్సీ లేల్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందగం సురేష్, విజయవాడ వైసీపీ కోఆర్డినేటర్ దేవినేని అవినాష్ ముందస్తు బెయిలు కోసం ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో వారి అరెస్టు అనివార్యమని అంతా భావించారు. కానీ పోలీసులు మాత్రం వారిలో మాజీ ఎంపీ నందిగం సురేష్ వినా మిగిలిన వారిని పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. వారంతా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ లోగా ఈ కేసులో అరెస్టును తప్పించుకుని తిరుగుతున్న వారిలో దేవినేని అవినాష్ ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఒక వేళ సుప్రం కోర్టులో ఆయనకు బెయిలు లభిస్తే.. ఈ కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్న వారంతా ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టుకు వెళతారు. వారికీ యాంటిసిపేటరీ బెయిలు లభిస్తే లభించవచ్చు. ముందస్తు బెయిలు ఊరటే కానీ, వారిని కేసుల నుంచి విముక్తి చేయదు.
కానీ హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించడమే కాకుండా సుప్రీం ను ఆశ్రయిస్తామనీ అంత వరకూ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలన్న నిందితుల వినతిని కూడా కోర్టు తోసి పుచ్చి రోజులు గడుస్తున్నా పోలీసులు పరారీలో ఉన్నవారి ఆచూకీ కూడా కనిపెట్టలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం శ్రేణుల్లో అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కొందరు పోలీసులు ఇప్పటికీ వైసీపీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ నేతలను కాపాడుతున్నరన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.