ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చిన విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, బీజేపీ మధ్య డీల్ కుదరడం వల్లే బెయిల్ వచ్చిందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్ట్ స్పందించింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తాము బెయిల్ ఇస్తామా అని ప్రశ్నించింది. 2015 నాటి ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరుగుతున్న సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బైఆర్ గవాయ్, పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు పట్ల గౌరవంతో ఉండాలని, రాజ్యాంగ బద్ధమైనపదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. కాబట్టి కేసును బదిలీ చేయాలంటూ పిటిషనర్ కోరినట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయమంటారా?’’ అంటూ రేవంత్ రెడ్డి అడ్వకేట్లు ముకుల్ రోహత్గీ, సిద్దార్థ్ లూథ్రాలను న్యాయమూర్తులు ప్రశ్నించారు.