posted on Aug 29, 2024 11:31AM
హైదరాబాద్ నగరంలో మరో కామోన్మాది రెచ్చిపోయాడు. ఒక యువతిని దారుణంగా హత్య చేశాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గచ్చిబౌలి ప్రాంతంలోని గోపనపల్లి తండాలో ప్రేమ పేరుతో ఒక ఉన్మాది దాడి చేయడంతో దీపన తమాంగ్ అనే 32 సంవత్సరాల యువతి మరణించింది. ఉన్మాది దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం రాత్రి ఈ ఘోరం జరిగింది.
కర్ణాటకలోని బీదర్కి చెందిన రాకేష్ పశ్చిమ బెంగాల్కి చెందిన దీపన తమాంగ్కి కొన్నేళ్ళుగా పరిచయం వుంది. రాకేష్, దీపన చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. తనను పెళ్ళి చేసుకోవాలని దీపనని రాకేష్ చాలాకాలం నుంచి అడుగుతున్నాడు. అయితే దీపన నిరాకరిస్తోంది. బుధవారం రాత్రి దీపన ఇంటికి రాకేష్ వెళ్లాడు. అక్కడే ఉన్న కూరగాయల కత్తితో దీపనపై దాడి చేశాడు. దీంతో దీపన అక్కడికక్కడే మరణించింది. అడ్డుకునేవారి మీద కూడా రాకేష్ దాడి చేయడంతో వాళ్ళు కూడా గాయపడ్డారు. దాడి తర్వాత రాకేష్ మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద ఆత్మహత్యకు యత్నించాడు. విద్యుత్ స్తంభం ఎక్కేందుకు ప్రయత్నించడంతో షాక్ తగిలి గాయాలయ్యాయి. గచ్చిబౌలి పోలీసులు రాకేష్ని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.