posted on Aug 21, 2024 6:08PM
ఈ సమీక్షా సమావేశంలో గత పదేళ్లలో పోలీసు శాఖలో నెలకొన్న పరిస్థితులపై అధికారులు వివరించారు. 2014-19 పోల్చితే 2019-24లో క్రైం రేట్ 46 శాతం పెరిగిందని అధికారులు వివరించారు. 2014-19 తో పోల్చుకుంటే 2019-23 మధ్యకాలంలో మహిళలపై నేరాలు 35.91 శాతం, మహిళల అదృశ్యం కేసులు 84.83 శాతం, సైబర్ నేరాలు 134.43 శాతం పెరిగాయని తెలిపారు. అలాగే గంజాయి, డ్రగ్స్ కేసులు 107.89 శాతం, చిన్న పిల్లలపై నేరాలు 151.88 శాతం పెరిగాయని వెల్లడించారు. గత ప్రభుత్వ తీరుతో పోలీసు శాఖ ఎలా నిర్వీర్యమైందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలీసు శాఖలో ఆయా విభాగాలకు ఇవ్వాల్సిన చిన్న చిన్న ఆర్థిక మొత్తాలను కూడా చెల్లించకపోవడం వల్ల పోలీసులు, పోలీసు శాఖ ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.
పోలీసు శాఖ వద్ద 143 డ్రోన్లు ఉంటే అందులో కేవలం 88 మాత్రమే పని చేస్తున్నాయంటే పోలీసు శాఖ ఎంత నిర్లక్ష్యానికి గురైందో అర్ధం చేసుకోవచ్చు. బాడీ వోర్న్ కెమేరాలు 1250 ఉంటే 444 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో 1180 కెమేరాలకు గాను కేవలం 317 మాత్రమే పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 14,712 సీసీ కెమేరాల్లో 2371 కెమేరాలు పనిచేయడం లేదని వివరించారు. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం కూడా పనిచేయడం లేదని తెలిపారు. వీటన్నింటినీ తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు అవసరమైన రూ. 30 కోట్లు నిధులు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించకపోవడం వల్ల చాలా సేవలు అందుబాటులో లేకాండా పోయాయని….వీటి వల్ల నేర విచారణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. పోలీసు విభాగంలో 2014-19 మధ్య 5215 వాహనాల కొనుగోలుకు రూ.221.8 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.67.3 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కాలం చెల్లిన వాహనాలతో పోలీసు శాఖ ఇబ్బంది పడుతోందని…ప్రస్తుతం 2812 వాహనాల కోసం రూ.281 కోట్లు బడ్జెట్ అవసరమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలీసు శాఖను గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్న చంద్రబాబు నాయుడు దీక్షకాలంగా పెండింగ్ లో ఉన్న పది కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలీసు శాఖను మళ్లీ గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా వ్యవస్ధల్లో పరికరాల నిర్వహణ ఖర్చులకు ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రూ.10 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సీసీ కెమేరాల ఏర్పాటులో పెండింగ్ లో ఉన్న రూ.11 కోట్ల బిల్లులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీస్ శాఖను ఆధునికీకరించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాటాగా రూ.61 కోట్లు విడుదల చేయడానికి కూడా సీఎం ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వం పోలీసులను క్షక్ష సాధింపులకు, ప్రజల, రాజకీయ పార్టీల అణిచివేతకు ఉపయోగించుకుందన్న చంద్రబాబు తమ ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండదని విస్పష్టంగా చెప్పారు,
మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ఆడబిడ్డల జొలికి వస్తే అదే చివరి రోజు అనేది నేరస్తులకు అర్థం కావాలి అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించాలనీ, ఆ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని చంద్రబాబు చెప్పారు.