posted on Aug 21, 2024 2:12PM
ఏపీలో వర్షాభావంతో నాట్లు ఆలస్యమవుతున్నాయి. గత ఏడాది లాగే ఈ ఏడాదీ తొలకరి లో వర్షాలు పడ్డాయి.ఖరీఫ్ పంటలకాలం ఆగస్టులో వర్షాలు మాయం. ముసురుపట్టాల్సిన సమయంలో వేసవిని తలపించేలా ఎండ తీవ్రత ఉంది. అయితే ఈ వాతావరణం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ ఓకేలా లేదు. కొన్ని ప్రాంతాలలో అతివృష్టి, మరి కొన్ని ప్రాంతాలలో అనావృష్టి అన్నట్లుగా వాతావరణం ఉంది. ముఖ్యంగా అన్నపూర్ణగా పేరొందిన ఉమ్మడి కృష్ణా జిల్లా లో రైతులు వర్షాలు లేక కాలువలు రాక నారుమళ్లు పోయడానికి ఎంతో కష్టపడుతున్నారు. జులైలో విత్తనాలు భూమి మీద చల్లితే భారీ వర్షాలు పడి మొక్కలు మొలవలా. దాంతో ఇంజన్లు పెట్టి నారుమళ్లు పోసారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పట్టిసీమ ప్రారంభించి నీటి కొరత లేకుండా చేసారు. జగన్ అధికారంలోకి రావడంతో పట్టిసీమను ఒట్టిసీమ చేసేశారు. దీంతో ఇంజన్లు తుప్పు పట్టాయి. కృష్ణా డెల్టా రైతులు నీరు అందక నానా బాధ పడ్డారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినా గతంలో ఉన్న నీటి భరోసా ఇప్పుడు లేదు. కాలువల మొదట్లో నీరు వచ్చినా కాలువ చివరి రైతులు నీరు రాక పంటలు వేయడం ఆలస్యమవుతున్నది. ఇది వరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభావం పడే అవకాశం ఉంది. ఆ తరువాత వేసే అపరాల పంట ఉత్పత్తి పై కూడా ఈ ప్రభావం పడు తుంది.
బంగాళాఖాతంలో అల్ప పీడనాల ప్రభావాలు అంతగా లేవు. నైరుతీ రుతుపవనాలు గతి తప్పడంతో కూడా వర్షాభావం ఏర్పడిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 50 మండ లాలకు పైగా వర్షాభావ పరిస్థితి కనిపిస్తున్నది.ముఖ్యంగా కాలువలు పై నిఘా పెట్టి కాలువ చివరి భూములకునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పట్టి సీమ ద్వారా గోదావరి జలాలు ఉమ్మడి కృష్ణా జిల్లా భూములకు అందేలా కూడా చర్యలు తీసుకోవాలి.భూమి,సముద్రం,వాతావరణం మూడు వేడెక్కిపోవడమే ఈ వింత పరిస్థితికి కారణమని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.మామూలు పరిస్థితుల్లో భూమి వేడేక్కినప్పుడు సముద్రం చల్లగా ఉండి మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి.గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో రుతుపవనాలు కాలంలోనూ కొన్నిచోట్ల అతివృష్టి,మరోచోట అనావృష్టి ఏర్పడుతున్నది.
భవిష్యత్తు లో ఇలాంటి వాతావరణం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.మళ్లీ మనం పాత రోజులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది.చెరువులను,కుంటలను వర్షాలు పడినప్పుడు నింపుకుని అవసరాన్ని బట్టి వాడుకోవాలి.అందుకు మనకు ఉన్న భూమిలో కుంటలు తవ్వి వర్షపు నీరునిలువచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.లేదా గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని చెరువులు,కుంటలు నింపాలి.నీటి ప్రాజెక్టు లు,కాలువలద్వారా నీరు వర్షాలు పడితేనే క్రిందకు వస్తాయి. లేకపోతే ప్రాజెక్టుల్లోఎంత జలకళ ఉన్నా రైతుల పొలాల్లో మాత్రం పారే అవకాశం కష్టమే మరి.