posted on Apr 26, 2024 10:08AM
1) కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ లో ఉన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగానూ కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ చేతిలో 15,822 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.
2) బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా 40 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సర్పంచ్ నుంచి ఆర్టీసీ చైర్మన్ వరకు పదవులను చేపట్టడమే కాదు.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగానూ పని చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి చేతిలో దాదాపు 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
3) బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సిటింగ్ ఎంపీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుండి శాసనసభకు పోటీ చేసి, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో 10,305 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు.
శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైన ఈ ముగ్గురూ వారి, వారి పార్టీల తరపున ఈ సారి నిజామాబాద్ లోక్ సభ స్థానం నుండి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, గత ఎన్నికలలో పసుపుబోర్డు తెస్తానని రాసిచ్చిన బాండ్ పేపర్, సొంత డబ్బులతో తెరిపిస్తానన్న షుగర్ ఫ్యాక్టరీ హామీలు ఈ సారి ఆయనకు చిక్కులు తెస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు పసుపు బోర్డుపై ప్రధానమంత్రితో ప్రకటన చేయించినా, ఆ తర్వాత ఎలాంటి కార్యాచరణ లేకపోవడం, పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి అధికార పార్టీ గ్యారెంటీ ల్ని ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి అయ్యేలా చూసుకుందామని రేవంత్ రెడ్డి జోష్ పెంచారు.
ముగ్గురూ ఉద్ధండులే కావడంతో ఇక్కడ ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ముగ్గురికీ రాజకీయ పరపతి ఉండడం, ఆయా సామాజిక వర్గాల మద్దతు ఉండడంతో పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపును డిసైడ్ చేసేది గల్ఫ్, బీడీ కార్మికులని చెప్పవచ్చు. ఉపాధి కోసం భర్తలు గల్ఫ్ దేశాలకు వెళ్లగా.. భార్యలు బీడీలపై ఆధారపడి పని చేస్తున్నారు. బీడీ, గల్ఫ్ కుటుంబాల ఓటర్లు ఐదున్నర లక్షల వరకూ ఉంటారు. వీరు తీసుకునే నిర్ణయం ఎన్నికల్లో కీలకం కానుంది. అందుకే, అన్ని పార్టీలూ వారిని ఆకర్షించేందుకు పావులు కదుపుతున్నాయి.
1. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పది రోజుల క్రితం గల్ఫ్ సంఘాలతో హైదరాబాద్లో సమావేశమయ్యారు. వారికిచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు పునరావాసం కల్పిస్తామని, గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని తెలిపారు.
అలాగే, నియోజకవర్గంలో మున్నూరు కాపు, పద్మశాలి సామాజికవర్గ ఓటర్లు కూడా ఎక్కువే. బరిలో ఉన్న సిటింగ్ ఎంపీ అర్వింద్, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇద్దరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. గత ఎన్నికల్లో వీరి ఓట్లు గంపగుత్తగా అర్వింద్కు పడగా.. ఈదఫా ఇద్దరూ చీల్చుకునే అవకాశం ఉంది. పద్మశాలి ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ అంచనా వేసుకుంటోంది. ఇక్కడ ఓట్లు చీలితే అది కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది.
2. పదేళ్లలో వారికి కేసీఆర్ సర్కారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తనకు ఓట్లు కురిపిస్తాయని బీఆర్ఎస్ నేత భావిస్తున్నారు.
3. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా నిజామాబాద్ ఓటర్ల మద్దతు తమ కేనని బీజేపీ అంచనా వేసుకుంటోంది.
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మైనారిటీ ఓటర్లూ కీలకమే. ఇక్కడి పట్టణ ప్రాంతాల్లో మూడు లక్షల వరకూ మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని కాంగ్రెస్ భావిస్తుండగా.. సగానికి సగం ఓట్లు తమకూ వస్తాయని బీఆర్ఎస్ నేతలు అంచనా వేసుకుంటున్నారు. ముస్లిం ఓట్ల చీలిక తమకు లాభిస్తుందనే బీజేపీ ధీమాగా ఉంది.
ఇక్కడ ఓ విషయం మాట్లాడుకోవాలి. అదే నిజాంషుగర్ ఫ్యాక్టరీ. ప్రతి ఎన్నికలో ఇక్కడ నిజాంషుగర్ ఫ్యాక్టరీ ఎజెండాగా మారుతోంది. ఈ ఎన్నికలో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే సెప్టెంబరు 17 నాటికి ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ రెడ్డితో సహా నేతలు హామీలు ఇస్తున్నారు. చెరుకు రైతుల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను చేస్తున్నారు.
తనను గెలిపించగానే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి అర్వింద్తోపాటు పార్టీ నేతలు హామీలు ఇస్తున్నారు. రైతులను మోసం చేసేందుకే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఈ ప్రకటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
రైతులు, బీడీ కార్మికులు, గల్ఫ్ కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం ప్రతిసారీ విలక్షణ తీర్పునే ఇస్తున్నారు నిజామాబాద్ ఓటర్లు. రైతులే ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారు ఎటు మొగ్గితే వారే విజయాన్ని సాధిస్తున్నారు. ఎంపీ హోదాలో కవిత ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, పసుపు బోర్డు తీసుకురాకపోవడంతో రైతులే 2019లో పోటీగా నామినేషన్లు వేశారు. పార్లమెంట్ చరిత్రలోనే ఏకంగా 186 మంది పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్న కవితను ఓడించడంతోపాటు పసుపు బోర్డు తీసుకు వస్తామన్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్కు పట్టం కట్టారు. ఐదేళ్ల తర్వాత పసుపు బోర్డు ప్రకటించి జీవో జారీ చేసినా.. దానిని ఎక్కడ పెడతారో ఇంకా స్పష్టం చేయకపోవడంతో ఈసారి వారు తీసుకునే నిర్ణయమే కీలకంగా మారనుంది.
ప్రతిసారీ విలక్షణ తీర్పునిచ్చే నిజామాబాద్ ఓటర్లు ఈసారి ఎవరిని గెలిపిస్తారనేది ఉత్కంఠగా మారింది. మళ్లీ గెలిచి సత్తా చూపాలని అరవింద్, పార్లమెంటులో కాలు మోపాలని జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ లు ఎక్కడా తగ్గడం లేదు. ప్రతిసారీ విలక్షణ తీర్పునిచ్చే నిజామాబాద్ ఓటర్ ఈ సారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపనున్నారనేది ఉత్కంఠగా మారింది.
– ఎం.కె.ఫజల్