Lok Sabha Election 2024 : నల్గొండ లోక్ సభా స్థానికి బీఆర్ఎస్ లో డిమాండ్ పెరుగుతోంది. గత శాసన సభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన వారు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఇపుడు నల్గొండ ఎంపీ అభ్యర్థులుగా అవకాశం కోసం అధినాయకత్వాన్ని కోరుతున్నారు. గత రెండు 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఈ సీటును దక్కించుక లేకపోయింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన వేమిరెడ్డి నర్సింహారెడ్డి ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఈ సారి జరగనున్న ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఎంపీని గెలిపించుకోవాలన్న వ్యూహంలో బీఆర్ఎస్ ఉంది. ఈ మేరకు మాజీ ఎంపీ, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ పై హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. కానీ, తామూ పోటీలో ఉంటామని, తమకే టికెట్ కేటాయించాలని మరికొందరు నాయకులు సైతం అధిష్టానికి విన్నవించారని సమాచారం. ఈ నెల 16వ తేదీన నల్గొండ లోక్ సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరగాల్సి ఉన్న నేపథ్యంలో తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.