రూ.4.35 కోట్ల స్థలానికి ఫెన్సింగ్
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు జారీ చేసిన జీవో నెం. 59 జీవో క్రింద నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి నిర్మాణాలు లేకున్నా దరఖాస్తు చేసి అక్రమంగా క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నం చేసిన స్థలాలు గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని ఖానాపురం సర్వే నెం. 272 లో 300 గజాల ప్లాట్, ఖానాపురం డొంకలో 200 గజాల రెండు ప్లాట్లు, 150 గజాల ఒక ప్లాట్, వెలుగుమట్ల సర్వే నెం. 412లో 300 గజాల ఒక ప్లాట్ లలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా పలువురు జీవో 59 కింద దరఖాస్తు చేశారని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అలాంటి దరఖాస్తులను తిరస్కరించామన్నారు. సుమారు రూ. 4.35 కోట్ల విలువైన ఈ స్థలాలను రెవెన్యూ, మునిసిపల్ అధికారులు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని వివరించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది నిఘా పెట్టి, ఎలాంటి ఆక్రమణలు జరగకుండా, నిర్మాణాలు చేపట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.