- తాండూరు మున్సిపల్ తొలి కౌన్సిల్ భేటీ…!
- 13 అంశాలకు గ్రీన్ సిగ్నల్
- పట్టణ అభివృద్ధికి రూ. కోట్లకు పైగా నిధుల కేటాయింపు
- వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 55 లక్షలు
- పార్టీలకతీతంగా ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుదాం:
- ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన సాధారణ సమావేశం పట్టణ అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలకు వేదికైంది. మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ అధ్యక్షతన జరిగిన ఈ తొలి సమావేశంలో మొత్తం 13 అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు.రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 11 రకాల పనుల నిమిత్తం రూ. 55 లక్షలను కేటాయించారు. అలాగే, పట్టణ పారిశుధ్యం మరియు నిర్వహణ కోసం వెహికల్ మౌంటెడ్ హైడ్రాలిక్ క్రేన్ కొనుగోలుకు గాను సాధారణ నిధుల నుండి మరో రూ. 55 లక్షల అంచనా వ్యయానికి ఆమోదం తెలిపారు.స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0 కింద తాండూరు పట్టణ సుందరీకరణకు కౌన్సిల్ మొగ్గు చూపింది. పట్టణంలోని ప్రధాన గోడలపై వాల్ పెయింటింగ్స్ మరియు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాల కోసం రూ. 8,70,585 కేటాయించారు. వీటితో పాటు జెసిబి మరమ్మత్తులు, విడిభాగాల సేకరణకు రూ. 4.86 లక్షలు, వీధి దీపాల నిర్వహణకు అవసరమైన క్రేన్ సాయం కోసం రూ. 3 లక్షలు కేటాయిస్తూ తీర్మానించారు. పాత పారిశుధ్య వాహనాలు, ఇతర సామగ్రిని బహిరంగ వేలం వేసేందుకు కూడా సభ్యులు అంగీకారం తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరును రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా మార్చడమే తమ లక్ష్యమని ప్రకటించారు. పట్టణ అభివృద్ధి విషయంలో పార్టీలకు తావులేదన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను ప్రభుత్వం నుండి మంజూరు చేయిస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈఈ మణిపాల్, ఏఈలు కాజా హుస్సేన్, ఉదయ్ కుమార్ మరియు కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.




