- భాష్యం కళాశాలలో ‘వేసవి’ సెగ
- విద్యార్థుల మెసేజ్ల కలకలం..!
- కాపాడండి బాబోయ్.. ఈ చదువుల జైలును ఆపండి..! అంటూ రోదిస్తున్న విద్యార్థులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : “సార్.. మా కాలేజీకి వచ్చి ఈ క్లాసులను ఆపేయండి.. మమ్మల్ని కాపాడండి బాబోయ్!” – ఇవి తాండూరులోని భాష్యం జూనియర్ కళాశాల విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులకు పంపిస్తున్న ఆర్తనాదాలు. ఫోన్ కాల్స్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ మెసేజ్ల ద్వారా తమ గోడును వెళ్లబోసుకుంటూ, ఈ ‘చదువుల చెరసాల’ నుండి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు.సాధారణంగా ఈ ఎండాకాలంలో విద్యార్థులు తమ అమ్మమ్మ ఊరికో, చుట్టాల ఇంటికో వెళ్లి సరదాగా గడపాలని కలలు కంటారు. కానీ భాష్యం యాజమాన్యం మాత్రం విద్యార్థుల ఆశలను తుంచేస్తూ, ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సుదీర్ఘంగా క్లాసులు నిర్వహిస్తోంది. ఇంటర్ ఫలితాలు వెలువడక ముందే ‘ఎంసెట్ కోచింగ్’ అనే బోర్డు తగిలించి, దొడ్డిదారిన సెకండియర్ పాఠాలు చెప్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని టాప్ కార్పొరేట్ కళాశాలలే ఇంకా క్లాసులు మొదలుపెట్టలేదు. కానీ తాండూరు భాష్యం యాజమాన్యం మాత్రం ‘అత్యుత్సాహం’ ప్రదర్శిస్తూ విద్యార్థులను పుస్తకాలకు పరిమితం చేస్తోంది. ఒకవైపు పట్టణంలో పలు సంఘాలు ఉచితంగా శిక్షణ ఇస్తుంటే, ఇక్కడ మాత్రం ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తూ ఎంసెట్ కోచింగ్ ఇవ్వడం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. ఇది చూసిన ప్రజలు ఇదెక్కడి విన్యాసం రా మామ..!అంటూ కళాశాల తీరును ఎండగడుతున్నారు.విసుగు చెందిన విద్యార్థులు గ్రూపుల్లో మెసేజ్లు చేస్తూ విద్యార్థి సంఘాల నాయకుల సహాయం కోరుతున్నారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేసవిలో తరగతుల నిర్వహిస్తున్న చర్యలు శూన్యం. విద్యార్థులు రోదిస్తున్నా, అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక మర్మమేంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.తక్షణమే విద్యాశాఖ అధికారులు ఈ కళాశాలపై విచారణ జరిపి, విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించాలని, నిబంధనలు అతిక్రమించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తాండూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు.



