- శాస్త్రీయ దృక్పథంతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు..!
- కౌన్సిలర్ బంటు వేణు
- శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫేర్
జనవాహిని ప్రతినిధి తాండూరు : విద్యార్థులు చిన్నతనం నుండే శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేసుకున్నప్పుడే గొప్ప ఆవిష్కరణలు సాధ్యమవుతాయని తాండూరు 11వ వార్డ్ కౌన్సిలర్ బంటు వేణు అన్నారు. శనివారం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల ఆవరణలో నిర్వహించిన “సైన్స్ ఫేర్” (విజ్ఞాన ప్రదర్శన) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి తయారు చేసిన వివిధ రకాల నమూనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, సౌర శక్తి వినియోగం మరియు అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను కౌన్సిలర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు తమ ప్రయోగాల గురించి వివరిస్తున్న తీరును చూసి ఆయన వారిని ప్రత్యేకంగా అభినందించారు.విజ్ఞాన ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి బంటు వేణు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీస్తాయని, ఉపాధ్యాయులు విద్యార్థులను పరిశోధనల వైపు ప్రోత్సహించాలని కోరారు.విద్యా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, విద్యార్థులను ఉత్సాహపరుస్తున్న కౌన్సిలర్ బంటు వేణును పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.



