- కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలపై భగ్గుమన్న కాలనీ యువత
- డ్రగ్స్ ఎవరు తీసుకున్నారు నిరూపించాలి
- తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్…!
జనవాహిని ప్రతినిధి తాండూరు : సోమవారం తాండూరు పట్టణంలో రహిత తాండూర్ అనే కార్యక్రమం లో స్థానిక కాలనీలను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు నయీమ్ అఫు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ…. రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ వంటి ప్రాంతాల్లోని యువత డ్రగ్స్కు బానిసలవుతున్నారని చేసిన వ్యాఖ్యలపై ఆయా ప్రాంతాల యువకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.తమ ప్రాంతాల్లో ఎంతో మంది విద్యావంతులు, కష్టపడే యువత ఉన్నారని, అందరినీ ఉద్దేశించి ‘డ్రగ్స్ బానిసలు’ అని ముద్ర వేయడం అన్యాయమని స్థానిక యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం లేదా ప్రచారం కోసం తమ కాలనీల గౌరవాన్ని బజారున పడేయడం సరికాదని వారు ఖండిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు తమ మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని వారు పేర్కొన్నారు.ఈ ఉదంతంతో నయీమ్ అఫు ఒక్కసారిగా వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ అంశంపై చర్చ నడుస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, యువతను ప్రోత్సహించాల్సింది పోయి, ఇలా కించపరిచేలా మాట్లాడటం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న యువకులు డ్రగ్స్ కు బానిసలూ ఎలా అయ్యారో నిరూపించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, కాలనీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



