- అర్హులకే ‘ఇందిరమ్మ’.. పైసా ఖర్చు లేకుండా సొంతింటి కల!
- అసత్య ప్రచారాలు చేస్తే ఖబడ్దార్
- ఇళ్ల పేరు చెప్పి వసూళ్లు చేసింది మీరు
- బిఆర్ఎస్ నాయకుల మాటలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు నాగు
జనవాహిని ప్రతినిధి తాండూరు : పేదవాడి సొంతింటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు బాతుల నాగు అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. శనివారం అయన ఓ ప్రకటన విడుదల చేస్తూ…..శుక్రవారం బిఆర్ఎస్ నాయకులు కలెక్టర్ కార్యాలయం దగ్గర మాట్లాడిన మాటలను నాగు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, ఇప్పుడు ఉనికి కోసం ప్రతిపక్ష కౌన్సిలర్లు వికారాబాద్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ‘ప్రజాపాలన’ ద్వారా దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. అధికారుల క్షేత్రస్థాయి సర్వే ఆధారంగానే లబ్ధిదారులను L1, L2, L3 కేటగిరీలుగా విభజించి, పారదర్శక పద్ధతిలో ఇళ్లను కేటాయిస్తున్నట్లు వివరించారు. తాండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించారని, అందులో 200 ఇళ్ల గృహప్రవేశాలు కూడా పూర్తయ్యాయని గుర్తుచేశారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలను నాగు తీవ్రంగా ఖండించారు. “ప్రస్తుతం 1,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇవి పూర్తిగా అర్హులకే అందుతాయన్నారు. గతంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరు చెప్పి డబ్బులు వసూళ్లు చేసింది మీరే కదా అని విమర్శించారు. సబ్జెక్ట్ తెలియకుండా, కేవలం ప్రచారం కోసం బీఆర్ఎస్ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. అభివృద్ధికి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం కానీ, లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదు” అని హెచ్చరించారు.ఎమ్మెల్యే నాయకత్వంలో విద్య, వైద్యం, రవాణా వంటి అన్ని రంగాల్లో తాండూరు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.



