- లీజు ఒకచోట.. తవ్వకాలు మరోచోట
- పెద్దేముల్ మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్
- అధికారులకు రైతుల ఫిర్యాదు.. చర్యల కోసం నిరీక్షణ
జనవాహిని ప్రతినిధి తాండూరు : పెద్దేముల్ మండల పరిధిలోని తట్టేపల్లి గ్రామ సమీపంలో అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు జరగుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఎటువంటి అడ్డుఅదుపు లేకుండా సాగుతున్న ఈ దందాలో ‘సర్వే నంబర్ల’ మాయాజాలం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజు ఒక సర్వే నంబరులో ఉంటే, తవ్వకాలు మాత్రం మారుమూల ప్రాంతాల్లోని లవణ పట్టా భూముల్లో (ప్రభుత్వ అసైన్డ్ భూములు) కొనసాగుతుండటం గమనార్హం.గ్రామానికి దూరంగా, అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న మారుమూల భూములను అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. స్థానిక రాజకీయ నాయకులను, కొందరు క్షేత్రస్థాయి సిబ్బందిని ‘మేనేజ్ ’ చేస్తూ రాత్రికి రాత్రే జెసిబిలతో మట్టిని తరలిస్తున్నారు. లీజు పత్రాల్లో చూపించిన స్థలానికి, వాస్తవానికి తవ్వకాలు జరుగుతున్న స్థలానికి పొంతన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.ఈ అక్రమ తవ్వకాల వల్ల తమ సాగు భూములు దెబ్బతింటున్నాయని, భారీ వాహనాల రాకపోకలతో పొలాల గట్లు తెగిపోతున్నాయని తట్టేపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా అక్రమార్కులు వెనక్కి తగ్గకపోవడంతో, తాజాగా బాధితులు మైనింగ్ శాఖ అధికారులను ఆశ్రయించారు. తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని వినతి పత్రం అందజేశారు.గతంలోనూ పలుమార్లు ఫిర్యాదులు అందినప్పటికీ, ఉన్నతాధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లీజు నంబర్లు మార్చి సాగిస్తున్న ఈ ‘భూ’ భాగోతంపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.





