- పైపులైన్ బాగు చేయకుండానే గుంతలు పూడ్చేశారు!
- తాండూరులో అధికారుల నిర్లక్ష్యం.. మూడు నెలలుగా నీటి సరఫరా బంద్
- పాత తాండూరు ప్రజల తీవ్ర ఆవేదన
జనవాహిని ప్రతినిధి తాండూరు : అధికారుల సమన్వయ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం సామాన్య ప్రజలకు శాపంగా మారుతోంది. తాండూరు పట్టణంలోని పాత తాండూరు రైల్వే గేటు సమీపంలో జరుగుతున్న ఫ్లైఓవర్ పనులు స్థానికులకు చుక్కలు చూపిస్తున్నాయి. పిల్లర్ల నిర్మాణం కోసం తవ్విన గుంతల వల్ల ధ్వంసమైన మంచినీటి పైపులైన్ను పట్టించుకోకుండానే, అధికారులు గుంతలను పూడ్చివేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా గత కొన్ని నెలలుగా ఇక్కడ పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పిల్లర్ల కోసం భారీ గుంతలు తీసిన సమయంలో భూగర్భంలో ఉన్న ప్రధాన మంచినీటి పైపులైన్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో గత మూడు నెలలుగా పాత తాండూరులోని పలు కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పిల్లర్ల నిర్మాణం పూర్తయిన తర్వాత, ఆ గుంతలను మట్టితో నింపే ప్రక్రియను చేపట్టారు. అయితే, తెగిపోయిన పైపులైన్కు కనీసం మరమ్మత్తులు చేయకుండానే, లోపల పైపులు అలాగే వదిలేసి అధికారులు గుంతలను పూడ్చివేయడం విస్మయానికి గురి చేస్తోంది.నీటి సరఫరా పునరుద్ధరించకుండానే మట్టి వేయడం ఏంటి? ఇప్పుడు పైపులు బాగు చేయాలంటే మళ్ళీ తవ్వాల్సిందే కదా! ప్రజల సొమ్మును ఇలా వృధా చేస్తారా?” అని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు.ఈ సమస్యపై అటు కాంట్రాక్టర్లు గానీ, ఇటు మున్సిపల్ అధికారులు గానీ దృష్టి సారించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం, రైల్వే పనుల పర్యవేక్షణ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే పైపులైన్ మరమ్మత్తులు చేపట్టి తమ నీటి కష్టాలు తీర్చాలని పాత తాండూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు.






