- బిఆర్ఎస్ నాయకులు నర్సింలు పై నిప్పులు చెరిగిన జోగుల ఎబినేజర్
- కార్యకర్తల డబ్బులు మింగేసింది నువ్వు కాదా..?
- పేదల ప్లాట్లలోనూ నీకు వాటాలేవా..? అంటూ విమర్శలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు బిఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు పై మాజీ బిఆర్ఎస్ నాయకుడు ఘాటుగా విమర్శలు చేశారు. నరసింహులు చెబుతున్న నీతులు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ధ్వజమెత్తారు.ఈ సందర్బంగా ఎబినేజర్ ఓ ప్రకటన లో మాట్లాడుతూ…. నరసింహులుపై పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడిన 36 వార్డుల కార్యకర్తలను, యువ నాయకులను నమ్మించి వమ్ము చేశారని.. వారికి అందాల్సిన ఎన్నికల ఖర్చులను నరసింహులు తన సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు.ఎన్టీఆర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిరుపేద యువకుల కోసం 75 గజాల చొప్పున స్థలాలు ఇస్తే.. అందులో అక్రమంగా 15 ప్లాట్లు నరసింహులు తన పేరిట ఉంచుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు అందిన సంక్షేమ పథకాల్లోనూ చేతివాటం ప్రదర్శించి, లబ్ధిదారుల నుంచి కమీషన్లు వసూలు చేసిన ఘనత నరసింహులుదేనని ఎద్దేవా చేశారు.మీ స్వార్థపూరిత చర్యల వల్ల తాండూరులో బిఆర్ఎస్ పార్టీకి, పైలట్ రోహిత్ రెడ్డి కి మనుగడ లేకుండా పోతోందన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పద్ధతి మార్చుకోకపోతే కార్యకర్తలే తగిన బుద్ధి చెబుతారు అని ఎబినేజర్ హెచ్చరించారు.



