- విద్యార్థులపై ఫీజుల భారం.. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం!
- బకాయిలు విడుదల చేయకపోవడంపై కందుకూరి రాజ్ కుమార్ ఆగ్రహం
- విద్యార్థుల చదువు మధ్యలో ఆగే ప్రమాదం ఉందని ఆందోళన
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రంలో నెలకొన్న ఫీజు రీయింబర్స్మెంట్ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ధ్వజమెత్తారు. హైకోర్టు తాజా తీర్పు ప్రకారం కళాశాలలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా అయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా….. ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను పెండింగ్లో పెట్టడం వల్ల విద్యా వ్యవస్థ కుప్పకూలుతోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల ఫీజుల విషయంలో ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకోవడమే హైకోర్టు తీర్పునకు దారితీసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.కళాశాల యాజమాన్యాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని, ఆ భారాన్ని విద్యార్థులపై మోపడం సరైంది కాదని రాజ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ క్రింది చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న అన్ని ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని,ఫీజుల చెల్లింపునకు సంబంధించి ఒక పక్కా షెడ్యూల్ను ప్రకటించాలన్నారు. ఫీజుల కోసం ఏ విద్యార్థిని కూడా కాలేజీలు ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం హామీ ఇవ్వాలని,ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడకముందే ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.



