- ఛైర్పర్సన్గా నీరజ బాల్రెడ్డి బాధ్యతల స్వీకారం
- హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..
- బిఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన, గైర్హాజరు
- మరోసారి అధికార, ప్రతిపక్ష పోరు కొనసాగేనా…?
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మళ్ళీ పాత పద్ధతి లోనే కొనసాగేలే ఉంది . మున్సిపల్ ఛైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన నీరజ బాల్రెడ్డి సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతతో 19 స్థానాలను గెలుచుకుని పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 12వ వార్డు నుండి భారీ మెజారిటీతో విజయం సాధించిన నీరజ బాల్రెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేయగా, ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీరజ బాల్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, పట్టణ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త పాలకవర్గం పనిచేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ శ్రేణుల సందడి మధ్యే ప్రతిపక్ష బిఆర్ఎస్ తన నిరసన గళాన్ని వినిపించింది. ఛైర్పర్సన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. గత మున్సిపల్ కౌన్సిల్ లో జరిగినట్టే ఈ కౌన్సిల్ లో కూడా అధికార, ప్రతిపక్ష పోరు కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పక్షం తీరును నిరసిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి 36 వార్డ్ ల కౌన్సిలర్ లకు ఆహ్వానం ఇచ్చినట్లు అధికార పార్టీ నాయకులు, అధికారులు తెలిపారు. మున్సిపల్ బాధ్యతల స్వీకరణ రోజే ప్రతిపక్ష కౌన్సిలర్లు గైర్హాజరు కావడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.అనంతరం ఛైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకు మరియు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తాండూరు పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.



