- అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ విద్యుత్ పెట్టె!
- చేతికి తాకే ఎత్తులో విద్యుత్ బాక్స్
- ప్రమాదం జరిగితేనే కనిపిస్తుందా…?
జనవాహిని ప్రతినిధి తాండూరు : అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. సామాన్య ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనం స్పష్టంగా కనిపిస్తోంది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లే పాదచారులకు రక్షణగా ఉండాల్సిన విద్యుత్ జంక్షన్ బాక్స్లు, నేడు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. తాండూరు పట్టణం లోని బస్టాండ్ నుండి చించొలి వెళ్లే రోడ్డు మార్గం లో దాదాపు 440 వోల్టుల హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా అయ్యే ఈ జంక్షన్ బాక్స్, గత కొన్ని నెలలుగా ఇలాగే తలుపులు తెరుచుకుని ఉంది. లోపల ఉన్న విద్యుత్ వైర్లు, స్విచ్లు అన్నీ బయటకే కనిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు గానీ, విద్యుత్ శాఖ సిబ్బంది గానీ అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రహదారి పక్కనే, సామాన్యుడి చేతికి అందే ఎత్తులో ఉన్న ఈ పెట్టె ఏ క్షణమైనా పెను ప్రమాదానికి దారితీసేలా ఉంది. పట్టణ సౌందర్యం, భద్రత గురించి మాట్లాడే అధికారులు, నిత్యం వేలాది మంది తిరిగే రోడ్డు పక్కన ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని ఎందుకు గమనించడం లేదు?విద్యుత్ తీగలు తెగిపడినా, బాక్సులు పాడైనా పట్టించుకోని వీరు, బిల్లుల వసూళ్లలో చూపే వేగం ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఎందుకు చూపడం లేదు?రహదారి నిర్వహణ బాధ్యత కలిగిన వీరు, ఫుట్పాత్పై ఇలాంటి ఆటంకాలు ఉన్నా చూసీచూడనట్లు వ్యవహరించడం శోచనీయం.ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణం పోతే తప్ప అధికారులు స్పందించరా?” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు తెలియక చేయి పెట్టినా, లేదా వర్షం పడినప్పుడు విద్యుత్ సరఫరా అయి షార్ట్ సర్క్యూట్ జరిగినా జరిగే అపరాధానికి ఎవరు బాధ్యత వహిస్తారు?వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, ఈ విద్యుత్ జంక్షన్ బాక్స్ను సరిచేసి, తలుపులు వేసి లాక్ చేయాలని, లేదా అక్కడి నుండి ఈ జంక్షన్ బాక్స్ తొలగించాలని స్థానిక ప్రజలు ఘాటుగా హెచ్చరిస్తున్నారు. అశ్రద్ధ వహిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.



