- చైర్మన్ నీరజ బాల్రెడ్డి ఆదేశాలతో ముమ్మరంగా ఫాగింగ్
- 15వ వార్డులో స్వయంగా రంగంలోకి దిగిన కౌన్సిలర్ ఎల్లప్ప
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దోమల నివారణకు మున్సిపల్ యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. గత వారం రోజులుగా పట్టణ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో దోమల నివారణ మందును పిచికారీ చేసే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది.మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రతి గల్లీలో ఫాగింగ్ నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నివారణ చర్యల్లో భాగంగా సోమవారం 15వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఎల్లప్ప ప్రత్యేక చొరవ చూపారు. సిబ్బందితో కలిసి వార్డులోని మురుగు కాలువలు, నిల్వ ఉన్న నీటి ప్రాంతాలను పరిశీలించిన ఆయన, స్వయంగా ఫాగింగ్ మెషిన్ పట్టుకుని మందును పిచికారీ చేశారు. కౌన్సిలర్ స్వయంగా రంగంలోకి దిగి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడంపై వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎల్లప్ప మాట్లాడుతూ.. మున్సిపల్ యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో వార్డ్ ఆఫీసర్ కార్తీక్, జవాన్ వెంకట్, వార్డ్ ప్రజలు ఉన్నారు.






