- పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
- అధికార పార్టీ అక్రమాలను అడ్డుకోవాలి: శ్రీశైల్ రెడ్డి పంజుగుల పిలుపు
జనవాహిని ప్రతినిధి తాండూరు : భారత రాష్ట్ర సమితి తాండూరు నియోజకవర్గ ఇంఛార్జిగా పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి పంజుగుల నియమితులయ్యారు. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు శ్రీశైల్ రెడ్డిని ఇంఛార్జిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం తాండూరులోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా నూతన ఇంఛార్జి శ్రీశైల్ రెడ్డి పంజుగుల మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్ల తొలగింపు సజావుగా జరిగేలా చూడాలని, ఈ ప్రక్రియలో అధికార పార్టీ చేసే అక్రమాలను సమర్థవంతంగా అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ బూత్కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ను తక్షణమే నియమించుకోవాలని టౌన్, మండల అధ్యక్షులకు సూచించారు. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి, ఆ వివరాలను సంబంధిత ఎమ్మార్వోలకు, ఆర్డీవోలకు అందజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ళ నర్సిములు, ఉమాశంకర్, నరేందర్ గౌడ్, సంతోష్ గౌడ్, జావేద్, వేణుగోపాల్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



