- తాండూరు ఇందిరా నగర్లో కొలువుదీరిన సీతారామయ్య!
- శాస్త్రోక్తంగా శ్రీ సీతారామ, లక్ష్మణ, హనుమత్ ప్రాణ ప్రతిష్ట
- వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఇందిరా నగర్లో వెలసిన ఏకైక శ్రీ రామ మందిర పునర్నిర్మాణ పర్వంలో భాగంగా బుధవారం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ, లక్ష్మణ మరియు హనుమంతుని విగ్రహాల ప్రాణ ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.పునర్నిర్మాణంలో భాగంగా గత కొన్ని రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచే గణపతి పూజ, పుణ్యాహవాచనం, విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి, మంగళ వాయిద్యాల నడుమ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పూర్తి చేశారు. భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో ఇందిరా నగర్ పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.ఈ ఆధ్యాత్మిక వేడుకకు కాలనీవాసులతో పాటు పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తుల సమిష్టి కృషితో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.





