- వికారాబాద్ జిల్లాలో ‘హస్తం’ ప్రభంజనం!
- నాలుగు మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం
- కొడంగల్, పరిగి, వికారాబాద్, తాండూరులో విజయదుందుభి
- ప్రభుత్వ పథకాలే గెలుపుకు సోపానాలు: డీసీసీ అధ్యక్షులు ధారసింగ్
- త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా
జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లాలో జరిగిన పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని మొత్తం నాలుగు మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుని ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇచ్చిందని జిల్లా అధ్యక్షులు ధారసింగ్ అన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్తో పాటు తాండూరు, వికారాబాద్, పరిగిలలో కాంగ్రెస్ జెండా ఎగిరిందన్నారు. ఈ సందర్బంగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారసింగ్ మాట్లాడుతూ…..జిల్లాలోని మున్సిపల్ ఫలితాలు కాంగ్రెస్ ఏకపక్షంగా సాగాయన్నారు. తాండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను గెలుచుకుని, ఎంఐఎం కూడా కాంగ్రెస్ కే మద్దతు ఇచ్చిందన్నారు. ఇక కొడంగల్ మున్సిపాలిటీలో 10 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిందని, పరిగిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో (మొత్తం 11 ఓట్లు) చైర్మన్ పదవిని కైవసం చేసుకోగా, వికారాబాద్ మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్ల బలంతో అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారన్నారు. సన్న బియ్యం సరఫరా, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందడం వల్లే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ‘బుట్టకప్పు’ మాటలను ప్రజలు నమ్మలేదని, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు మాత్రం అభివృద్ధి వైపే నిలిచారని విమర్శించారు. అనవసర నిందలు వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఈ ఫలితాలు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే జోరును కొనసాగిస్తుందని ధారసింగ్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని మొత్తం 20 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుని, వికారాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారణం పురుషోత్తం రావు, మురళి గౌడ్ లు ఉన్నారు.



