- పటేల్ ప్రవీణ్ మరణం తీరని లోటుపైలెట్ రోహిత్ రెడ్డి
- ధైర్యవంతుడైన నాయకుడిని కోల్పోయాం
- యువత క్షణికావేశానికి లోనుకావద్దు.. బతికి సాధించాలి
- బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే భరోసా
జనవాహిని ప్రతినిధి తాండూరు : బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక నేత, వీరశైవ యువదళ్ నాయకుడు పటేల్ ప్రవీణ్ మరణం పార్టీకి తీరని లోటని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రవీణ్ మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కేవలం ఒక కార్యకర్త మాత్రమే కాదని, సుదీర్ఘ కాలంగా తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటూ వచ్చారని గుర్తు చేసుకున్నారు. పటేల్ ప్రవీణ్ మరణానికి గల కారణాలను రోహిత్ రెడ్డి వివరించారు. గత కొంతకాలంగా ప్రవీణ్ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొన్నారు. అప్పులు ఇచ్చిన వ్యక్తుల నుండి తీవ్రమైన ఒత్తిడి రావడంతో పాటు, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆందోళనకు గురై ఆత్మహత్యకు ప్రయత్నించారని వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించడం అత్యంత బాధాకరమన్నారు.ఈ సందర్భంగా యువతకు రోహిత్ రెడ్డి కీలక సూచన చేశారు. యువత ఎవరూ ఒత్తిడికి లోను కావద్దు. సమస్యలు ఎదురైనప్పుడు క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడితే కుటుంబాలు వీధిన పడతాయి. బతికి ఉంటేనే ఏదైనా సాధించుకోగలం అని హితవు పలికారు.ప్రవీణ్ మరణం తాండూరు పట్టణం మరియు పెద్దేముల్ మండలాల్లో పార్టీకి పెద్ద దెబ్బ అని రోహిత్ రెడ్డి ఆవేదన చెందారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా తాను పూర్తి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.






