- తాండూరు మున్సిపల్ పీఠం నీరజాబాల్ రెడ్డి వశం
- వైస్ చైర్మన్గా అబ్దుల్ రజాక్ ఏకగ్రీవ ఎన్నిక
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్గా పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, వైస్ చైర్మన్గా అబ్దుల్ రజాక్ ఎన్నికయ్యారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వీరిద్దరిని అధికారులు ప్రకటించారు. గత కొంతకాలంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం ఎన్నికల అధికారులు సమావేశాన్ని ప్రారంభించారు. మొత్తం కౌన్సిలర్లలో 19 మంది సభ్యులు హాజరుకావడంతో ఎన్నిక నిర్వహణకు అవసరమైన కోరం లభించింది. దీంతో అధికారులు ఎన్నిక ప్రక్రియను వేగవంతం చేశారు.చైర్పర్సన్ పదవికి పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి పేరును, వైస్ చైర్మన్ పదవికి అబ్దుల్ రజాక్ పేరును సభ్యులు ప్రతిపాదించగా.. ఇతర పోటీదారులు ఎవరూ లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా వెల్లడించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్మన్లతో అధికారులు పదవీ ప్రమాణస్వీకారం చేయించారు.పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కౌన్సిలర్లు, అధికారుల సమన్వయంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన ఎన్నికకు సహకరించిన నాయకులకు, కౌన్సిలర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.



