- యువతపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం..!
- బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ ఆగ్రహం
- కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలపై కౌన్సిలర్ ఫైర్..
- దమ్ముంటే డ్రగ్స్ ఆరోపణలు నిరూపించాలని సవాల్
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ యువతపై కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు స్థానికంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం యువతపై డ్రగ్స్ ముద్ర వేయడం సిగ్గుచేటని 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావీద్ మండిపడ్డారు. హైదరాబాద్లో ఎక్కడో జరిగిన డ్రగ్స్ వ్యవహారాన్ని పట్టుకుని తాండూరు యువతకు ఆపాదించడం విడ్డూరంగా ఉందని జావీద్ అన్నారు. మా కాలనీ యువకులు డ్రగ్స్ తీసుకున్నట్లు మీరు నిరూపిస్తే, నేనే స్వయంగా బాధ్యత వహిస్తానన్నారు. గత ఏడేళ్లుగా ఏ ఒక్క యువకుడు కూడా వ్యసనాల బారిన పడకుండా మేము ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నామన్నారు. నిరూపించే దమ్ముంటే రండి.. నేను కూడా విచారణకు సిద్ధం” అని ఆయన సవాల్ విసిరారు. గతంలో కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లుగా ఉన్న హయాంలో కాలనీల్లో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగేవని ఆయన ఆరోపించారు. మద్యం వల్లే యువత భవిష్యత్తు నాశనమవుతోందని, చిత్తశుద్ధి ఉంటే ఒక్క బెల్ట్ షాప్ లేకుండా అరికట్టాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలతో కాలనీల ప్రతిష్టను, యువకుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.



