- కారు గుర్తుకు ఓటు వేసి ఇర్షాద్ను గెలిపించండి
- తాండూరు మున్సిపల్ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం
- మైనారిటీల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉంది: పైలెట్ రోహిత్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లే శక్తి ఒక్క బీఆర్ఎస్ పార్టీకే ఉందని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా తాండూరు మున్సిపల్ 7వ వార్డు పరిధిలోని దర్గా మజీద్ మరియు నూర్ ఉలూమ్ మదర్సా మజీద్ల వద్ద ఆయన ముస్లిం సోదరులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఇర్షాద్కు ఒకసారి అవకాశం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఓటు వేసి మరోసారి మోసపోవద్దని, ఆ పార్టీ గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తాండూరు ముస్లిం సోదరులంతా ఏకతాటిపై నిలిచి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పట్లోళ్ల నర్సింలు గెలిస్తే, పట్టణం నలుమూలలా అభివృద్ధి జరుగుతుందని రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు అవసరమని పేర్కొంటూ, పార్టీ మేనిఫెస్టోను వివరించారు. చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో తాండూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.






