- తాండూరులో టాస్క్ ఫోర్స్ దాడులు
- 600 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్!
- కర్ణాటక తయారీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
- జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, ఆదేశాలతో తనిఖీలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటూ, లాభార్జనే ధ్యేయంగా కల్తీ దందాను కొనసాగిస్తున్న ముఠాపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. తాండూరు పట్టణ పరిధిలో గురువారం నిర్వహించిన మెరుపు దాడుల్లో సుమారు 600 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ కేంద్రంగా సాగుతున్న ఈ కల్తీ నెట్వర్క్ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర కు అందిన నమ్మదగిన సమాచారం మేరకు, జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ SK. అన్వార్ పాషా మరియు సిబ్బంది తాండూరులో నిఘా పెట్టారు. పాత కూరగాయల మార్కెట్ ప్రాంతానికి చెందిన రేపాల శ్రీధర్ (47) అనే వ్యక్తి కల్తీ పేస్ట్ విక్రయిస్తున్నట్లు గుర్తించి దాడి చేయగా, అతని వద్ద 40 కేజీల నిల్వలు దొరికాయి.నిందితుడు శ్రీధర్ను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఈ కల్తీ పదార్థాన్ని కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన యర్రమల్లి గిరిధర్ (40) అనే హోల్సేల్ వ్యాపారి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ బృందం బీదర్లోని గిరిధర్ షాపుపై దాడి చేసి, అక్కడ నిల్వ ఉంచిన మరో 560 కేజీల కల్తీ పేస్ట్ను, రవాణాకు ఉపయోగిస్తున్న KA 39 9028 నంబర్ గల వాహనాన్ని సీజ్ చేశారు.నిందితుల వివరాలు: యర్రమల్లి గిరిధర్ (తయారీదారు, బీదర్) రేపాల శ్రీధర్ (విక్రేత, తాండూరు)ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని తాండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆమె కోరారు.





