- అధికార గర్వంతో విర్రవీగుతున్న బుయ్యని బ్రదర్స్!
- పోలింగ్ కేంద్రాల్లోకి రాజ్యాంగేతర శక్తుల ప్రవేశం.
- పైలట్ రోహిత్ రెడ్డిపై అక్రమ కేసులను ఎత్తివేయాలి.
- 1000 కోట్ల నిధుల హామీ ఏమైంది? – నిలదీసిన బిఆర్ఎస్ శ్రేణులు.
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు గడ్డపై అధికార కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అప్రజాస్వామిక పాలనపై బిఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసం లో జరిగిన మీడియా సమావేశం లో…అధికార పార్టీ నేతల అక్రమాలను, పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి ఏ పదవి ఉందని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తారని బిఆర్ఎస్ నాయకులు నిలదీశారు. ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వీవీఎచ్ స్కూల్ కేంద్రంలో శ్రీనివాస్ రెడ్డి ప్రవేశించడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒక్కటే అన్న విషయం పోలీసులు మర్చిపోయారా అని మండిపడ్డారు.కౌంటింగ్ కేంద్రం వద్ద శాంతియుతంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా, ఆయనపై అక్రమంగా కేసులు నమోదు చేయడం దుర్మార్గమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కౌంటింగ్ పూర్తికాకముందే మీడియా పాయింట్ వద్ద హల్చల్ చేసినా పట్టించుకోని పోలీసులు, రోహిత్ రెడ్డి విషయంలో మాత్రం అతిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే సోదరులు పట్టణంలోని ప్రముఖులను, బిఆర్ఎస్ మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ధ్వజమెత్తారు.తాండూరు అభివృద్ధికి సీఎం నుంచి తెస్తానన్న రూ.1000 కోట్ల నిధులు ఎక్కడ?” అని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ కక్షసాధింపులకే సమయం కేటాయించకుండా, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బిఆర్ఎస్ తరపున గెలిచిన 12 మంది కౌన్సిలర్లు పట్టణ ప్రగతికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ వేధింపులు కొనసాగితే సహించేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ ముఖ్య నేతలు నరేందర్ గౌడ్, శోభ రాణి, రాజు పటేల్, వీరేందర్, శ్రీనివాస్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.



